పరిశుద్ధ గ్రంథము
పాత నిబంధన
కీర్తనల గ్రంథము
78వ అధ్యాయము
- Verse 1: నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి
- Verse 2: నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
- Verse 3: మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.
- Verse 4: యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
- Verse 5: రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి
- Verse 6: యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు
- Verse 7: మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును
- Verse 8: ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ మించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను
- Verse 9: విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి
- Verse 10: వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి
- Verse 11: ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
- Verse 12: ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.
- Verse 13: ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను
- Verse 14: పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
- Verse 15: అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
- Verse 16: బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.
- Verse 17: అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.
- Verse 18: వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.
- Verse 19: ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.
- Verse 20: ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.
- Verse 21: యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను.
- Verse 22: వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమి్మక యుంచలేదు.
- Verse 23: అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను
- Verse 24: ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.
- Verse 25: దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.
- Verse 26: ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.
- Verse 27: ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
- Verse 28: వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.
- Verse 29: వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.
- Verse 30: వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే
- Verse 31: దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో ¸°వనులను కూల్చెను.
- Verse 32: ఇంత జరిగినను వారు ఇంకను పాపముచేయుచు ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ము కొనక పోయిరి.
- Verse 33: కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచి పోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను.
- Verse 34: వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి.
- Verse 35: దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.
- Verse 36: అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు
- Verse 37: నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
- Verse 38: అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు.తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
- Verse 39: కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
- Verse 40: అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
- Verse 41: మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
- Verse 42: ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.
- Verse 43: ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.
- Verse 44: ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను
- Verse 45: ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.
- Verse 46: ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.
- Verse 47: వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను.
- Verse 48: వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.
- Verse 49: ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.
- Verse 50: తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.
- Verse 51: ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.
- Verse 52: అయితే గొఱ్ఱలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను
- Verse 53: వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.
- Verse 54: తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను.
- Verse 55: వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివ సింపజేసెను.
- Verse 56: అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.
- Verse 57: తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగి పోయిరి.
- Verse 58: వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి.
- Verse 59: దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహ్యించుకొనెను.
- Verse 60: షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.
- Verse 61: ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.
- Verse 62: తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను
- Verse 63: అగ్ని వారి ¸°వనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.
- Verse 64: వారి యాజకులు కత్తిపాలుకాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
- Verse 65: అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను.
- Verse 66: ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.
- Verse 67: పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.
- Verse 68: యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.
- Verse 69: తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను
- Verse 70: తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.
- Verse 71: పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.
- Verse 72: అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.