పరిశుద్ధ గ్రంథము
పాత నిబంధన
సంఖ్యాకాండము
21వ అధ్యాయము
- Verse 1: ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చు చున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందిరిని చెరపట్టగా
- Verse 2: ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జన మును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణము లను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.
- Verse 3: యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
- Verse 4: వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.
- Verse 5: కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్య మైనదనిరి.
- Verse 6: అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.
- Verse 7: కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.
- Verse 8: మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
- Verse 9: కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.
- Verse 10: తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి.
- Verse 11: ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.
- Verse 12: అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి.
- Verse 13: అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీ యులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.
- Verse 14: కాబట్టి యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా
- Verse 15: ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధ ముల గ్రంథములో వ్రాయబడియున్నది.
- Verse 16: అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.
- Verse 17: అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి
- Verse 18: తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి.
- Verse 19: వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును
- Verse 20: మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.
- Verse 21: ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.
- Verse 22: మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి.
- Verse 23: అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.
- Verse 24: ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది.
- Verse 25: అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీ యుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి.
- Verse 26: హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.
- Verse 27: కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను
- Verse 28: హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
- Verse 29: మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగాఇచ్చెను.
- Verse 30: వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
- Verse 31: అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.
- Verse 32: మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.
- Verse 33: వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా
- Verse 34: యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.
- Verse 35: కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.