పరిశుద్ధ గ్రంథము
పాత నిబంధన
సంఖ్యాకాండము
16వ అధ్యాయము
1 : లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీ యాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
2 : ఇశ్రాయేలీయు లలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి
3 : మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
4 : మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను
5 : తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.
6 : ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.
7 : అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.
8 : మరియు మోషే కోరహుతో ఇట్లనెనులేవి కుమారులారా వినుడి.
9 : తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?
10 : ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
11 : ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజ మును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.
12 : అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.
13 : అయితే వారుమేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంప వలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
14 : అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.
15 : అందుకు మోషే మిక్కిలి కోపించినీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.
16 : మరియు మోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.
17 : మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.
18 : కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్ని యుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.
19 : కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధ ముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజ మునకు కనబడెను.
20 : అప్పుడు యెహోవామీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.
21 : క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా
22 : వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడ వైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.
23 : అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
24 : కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
25 : అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.
26 : అతడుఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
27 : కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.
28 : మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.
29 : మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్నుపంప లేదు.
30 : అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
31 : అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.
32 : భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
33 : వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
34 : వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష వినిభూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.
35 : మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
36 : అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలి యాజరుతో ఇట్లనుముఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తు లను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.
37 : ఆ అగ్నిని దూర ముగా చల్లుము.
38 : పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠిత మైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును.
39 : అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి,
40 : కోరహువలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకు డైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.
41 : మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచుమీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి
42 : సమాజము మోషే అహరోను లకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.
43 : మోషే అహ రోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా
44 : యెహోవామీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి,
45 : క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.
46 : అప్పుడు మోషేనీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా
47 : మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేసెను.
48 : అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.
49 : కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.
50 : ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.